డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో ‘వ్యవసాయ విద్య’పై ప్రత్యేక అవగాహన తరగతులు
– విద్యార్థినులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై విలువైన మార్గదర్శనం చేసిన గుజ్జుల గౌరీశ్వర నాయుడు
– అరటి, మామిడి సాగు, కలుపు నివారణ, డ్రిప్ – స్ప్రింక్లర్ సేద్యంపై అవగాహన
నందికొట్కూరు జులై 25(నంది పత్రిక )లక్ష్మాపురంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక అవగాహన తరగతుల కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని 9వ, 10వ తరగతులు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థినులకు వ్యవసాయ బోధన అందిస్తున్న ఓకేషనల్ లెక్చరర్ శివపురం నజియా ఆహ్వానం మేరకు, శిక్షణ పొందిన దేశి డీలర్ గుజ్జుల గౌరీశ్వర నాయుడు గెస్ట్ లెక్చరర్గా హాజరై విద్యార్థినులకు బోధన చేశారు. 9వ తరగతి విద్యార్థినులకు అరటి, మామిడి వంటి ఉద్యాన పంటల సాగు విధానాలు, వాటి సంరక్షణ మరియు దిగుబడి పెంపొందించే పద్ధతులపై అవగాహన కల్పించారు.10వ తరగతి విద్యార్థినులకు పంటల్లో కలుపు మొక్కల నివారణ లో అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతుల గురించి వివరించారు.అదేవిదంగా ఇంటర్మీడియట్ విద్యార్థినులకు నీటి పొదుపును ప్రోత్సహించే స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ (బిందు-తెలికపాటి సేద్యం) ప్రాముఖ్యత మరియు సూక్ష్మ సేద్య విధానాల వల్ల కలిగే ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేశారు. తరగతుల అనంతరం విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు ఆయన ఉదాహరణలతో సవివరంగా సమాధానాలు ఇచ్చారు. ఆసక్తిగా ప్రశ్నలు అడిగిన విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులలో వ్యవసాయంపై శాస్త్రీయ అవగాహన, ఆసక్తి పెంపొందించడంలో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.
