నంద్యాల – ఒంగోలు జాతీయ రహదారి పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రవాగులో వజ్రాల వేట మొదలైంది. పెద్దగా వర్షాలు కురవకపోయినా.. గతంలో కురిసిన వర్షాలకు అటవీ ప్రాంతం నుంచి నీరు వచ్చింది. దాంతో అడవిలోని వజ్రాలు వాగుతో సహా కొట్టుకొచ్చి ఉంటాయనే కారణంతో స్థానికులు వజ్రాల అన్వేషణ మొదలుపెట్టారు. నీటి అడుగు భాగంలో వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. కడప, కర్నూలు, మార్కాపురం జిల్లా ప్రజలు ఎక్కువగా అన్వేషిస్తున్నారు.
నల్లమల అటవీ ప్రాంతం మరోసారి ఆశావాహులతో కిటికిటలాడుతోంది. వర్షాకాలం మొదలైందంటే నల్లమల ప్రాంతమంతా వజ్రాల వేటే. ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుంటారు. కొంతమంది అయితే నెలల తరబడి ఇదే ప్రాంతంలో ఉంటూ వజ్రాల వేట కొనసాగిస్తారు. ముఖ్యంగా నంద్యాల – ఒంగోలు ప్రధాన మార్గంలోని నల్లమల అడవీలో ఉన్న ఎర్రవాగు వైపే అందరూ ప్రయాణిస్తారు.
నల్లమల అడవీలో ఉన్న ఎర్రవాగులో జోరుగా వజ్రాల వేట కొనసాగుతోంది. నంద్యాల, కర్నూలు, మార్కాపురం, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని గ్రామాలకు చెందిన మహిళలు, పురుషులు ఎర్రవాగుకు చేరుకుని వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. వాగు వెంట నీటిలో జల్లెడ పడుతున్నారు. ప్రతి ఏటా వాగులో నీరు ప్రవహించే సమయాల్లో వజ్రాల కోసం ఈ అన్వేషణ కొనసాగుతుంది.
