కర్నూలు నగరంలో బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా జరిగిన ఫైనల్స్లో ఓడిపోయాడన్న కోపంతో ఒక వ్యక్తి లైసెన్స్ గన్తో గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఫైనల్స్ చూసేందుకు మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ కూడా హాజరయ్యారు. దాంతో అందరూ టెన్షన్కు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓటమితోనే కుంగిపోవడంతోనే తాను కాల్పులు జరిపినట్లు అంగీకరించాడు. దాంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నగరంలో బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ జరిగింది. ఆదివారం సాయంత్ర ఫైనల్స్ రసవత్తరంగా సాగింది. ఈ ఫైనల్స్ను తిలకించేందుకు మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ కూడా హాజరయ్యారు. క్రీడలపై మక్కువ ఎక్కువ చూపే కర్నూలు ప్రజలు కూడా చాలా మంది ఈ పోటీలు చూసేందుకు హాజరయ్యారు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ టీమ్ ఉత్కంఠభరిత పోరులో ఓటమిపాలయింది.
ఓటమిని జీర్ణించుకోలేక పోయిన కౌశిక్ తన వెంట తెచ్చుకున్న లైసెన్స్ తుపాకీతో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన మ్యాచ్లో గన్ సౌండ్ వినగానే ఎటోళ్లు అటు పరారయ్యారు. టీజీ వెంకటేశ్ కూడా అక్కడే ఉండటంతో పోలీసులతో పాటు ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఎవరి మీద ఎవరు కాల్పులు జరిపారో తెలుసుకునే వరకూ పోలీసులకు టెన్షనే.
